ధర్మగుణం

“ఒరే ! సుబ్బిగా యిలా వచ్చావేరా?”

“తవరి దరశనం సేసుకుపోదామని” అన్నాడు సుబ్బిగాడు.

“ఏం అలావున్నావు? వంట్లో బాగాలేదా?”

“అవును బాబయ్యా. పది రోజుల నుండి లేవటంలేదండి. తవరు ఏదైనా సాయం సేత్తే నలుగు రోజులపాటు తింటాను బాబుగారు.”

“ఆ ! ఏమన్నావు ! ఏదైనా…”

“…మరేనండి ఏదో నాలుగు కుంచాలు ధాన్యం గింజలు యిప్పించండి బాబు. నాలుగు రోజులపాటు తిని ఓపిక గూడుగట్టుకున్నాక పనిలోకి వచ్చి మీ రుణం తీర్చుకుంటా బాబు.”

“నీ కిస్తా కేమిటిరా ! అలాగే యిద్దును. కానీ సమయానికి ఇంట్లో ధాన్యం లేదు. పోనీ డబ్బులేమన్నా యిద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు.(ఎక్కడ మళ్ళీ డబ్బులాంటాడో అని ముందుగానే చెప్పేసాడు) యివాళ కాకపోతే రేపు యిద్దువు. నీలాంటి నమ్మకస్తుడికి యిస్తే ఎక్కడికి పోతాయి. పాపం ఓపిక చేసుకుని వచ్చావు. లంకణాలు ఎక్కువ చేసావో ఏమో – మరీ నీరసంగా ఉన్నావు. ఏమే ! నిన్నే – కాస్త మజ్జిగ తీసుకురా” గావుకేక పెట్టారు ధర్మయ్య గారు.

ధర్మ ప్రభువులు కాబట్టి మజ్జిగ అనే నీళ్ళు యిచ్చారు.

తడి ఆరిపోయిన గొంతులో నీళ్ళు పోసుకుని —-

“వత్తాను బాబుగారు” అని కాళ్ళీడ్చుకుంటూ బయలుదేరాడు సుబ్బిగాడు.

“ప్రతి వెధవకొడుక్కి అప్పు కావాలి. వీళ్ళకు యివ్వటం – వీళ్ళు మళ్ళీ నాకు తీర్చటమూనా ! రేపో మాపో చచ్చేవాడిలా ఉన్నాడు. అప్పు తీరుస్తాడట అప్పు. దుక్కలా వుంటే ఇవ్వొచ్చు. దేనికైనా పనికొస్తాడు.” అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు ధర్మయ్య గారు.

సుబ్బిగాడు నీరసంగాపోతూ ‘ధర్మయ్య బాబుగారు ధరమ పెబువులు. ఒకసారి ఏదో పెట్టి అర్ధరేతిరి పట్టికెళ్ళి పొరుగూరి పాపయ్యగారికి యిచ్చినందుకు పాతిక రూపాయలు యిచ్చారు. నాలుగు ఏళ్ళనాడు ఎలక్షన్లలో ఏ పనీ లేకపోయినా అక్కడివి యిక్కడ, యిక్కడివి అక్కడ చేరేసినందుకు, ఏదో నలుగురితోపాటు అరచినందుకు – రోజూ పది రూపాయలు యిచ్చేవోరు మారాజులు. ఇలా ఎన్నో రూపాయలు లెక్కలేకుండా ఇచ్చారు. అలాంటి మా పెబువులు డబ్బులుంటే ఒక్క పది రూపాయలు ఇవ్వరా? ఎంతోటోడికైనా యిబ్బందులుంటాయి. ఇంతకీ నా కర్మ యిలా వుండి అయన దగ్గర సొమ్ములేకపోయింది. ఈ పది రోజులనుండి మందులకు, మాకులకు ఇంట్లో వున్నవి తాకట్టుపెట్టి – దొరికినంత మట్టుకి అప్పు చేశాను. మాయదారి తెగులు నాకే రావాలా ? కూటికి లేక సత్తుంటే మందులకు ఎక్కడ పోయను… ఎదవ పానానికి ఇంత తీపి ఎందుకు?… ఆలోచిస్తూ యింటికి చేరాడు.

“పేనం సొమ్మసిల్లి పోతంది. గుక్కెడు మంచినీళ్ళు యిచ్చేవోరు లేరు గందా” నులక మంచం మీద వాలిపోయాడు.

నాలుగు రోజులు పోయాక — ఒకనాటి పొద్దుట —-”సుబ్బయ్య పోయాడురా” అన్నాడొక ఆసామి.

“ఆ ! సుబ్బిగాడు పోయాడా ! రామ రామ” అంటూ తుపుక్కున ఉమ్మేసాడు మరొక ఆసామి.

“ఏమిటేమిటీ సుబ్బిగాడు పోయాడా ! ఆ ధర్మయ్యగారి పనిలో తిరిగే సుబ్బిగాడేనా? దుక్కలా ఉండేవాడు. ఎట్టా పోయాడు.”

సుబ్బిగాడి శవం చుట్టూ పది పదిహేనుమంది గుమికూడారు.

“అయ్యో ! ఎంత మంచివాడని – ఒకళ్ళని పన్నెత్తుమాట అని ఎరుగడు కదా! మొన్న లంకణాలు పడ్డాడు కాబోలు. రెండు రూపాయలుంటే యిమ్మని వచ్చాడు. సమయానికి చేతిలో చిల్లిగవ్వ లేదు.”

“ఏనాడు పెళ్ళాం పోయిందో కానీ ఆనాటినుండి ఈనాటివరకు కూడా తనే వండుకుంటూ పని ఉన్ననాడు ఎళ్ళి, లేనినాడు ముసుగుతన్ని పడుకునేవాడు.”

“ఎవరికైనా ఏదైనా సాయం కావలిసొస్తే ముందూ ఎనకా చూడకుండా – తన పనే అనుకుని చేసేవోడు.”

మాలావు కట్టం పడేవోడులే.”

“ఎన్ననుకుంటే ఏటుంది – ఈనాటికీ భూమ్మీద నూకలు సెల్లిపోనాయి.”

…యిలా ఆ గుంపులోంచి అనేక మాటలు వినిపిస్తున్నాయి. సుబ్బిగాడు చేసిన మంచిపనులకు మరికాస్త మంచితనం కల్పించి తెగ పొగుడుతున్నారు.

అంతలో ఎవరో “తప్పుకోండి” “తప్పుకోండి” అంటున్నారు. వెనకాలే ధర్మయ్యగారు ఎంతో దయతో సుబ్బిగాడి శవం చూట్టానికి వచ్చారు.నడుంకు అంటుకుపోయిన పొట్ట, తోటకూర కాడల్లాంటి కాళ్ళూ చేతులు, అంగుళం లోతుకు పోయిన గాజుకళ్ళు… పాపం అంతోటి పెద్దమనిషికి కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి(వచ్చాయో రాలేదోగాని భుజం మీద కండువాతో కళ్ళు తుడుచుకోవటం ప్రజలు చూసారు)

“ఒరే ! నాగన్నా ! అలాచూస్తావేరా ! మన కుడిభుజం పడిపోయిందిరా.దుక్కలా వుండి బండెద్దులా పనిచేసేవోడు. ఏది చెప్పినా చిటికెలో చేసిపెట్టే వాడు. నేటికి — వీడికి మనకి రుణం తీరిపోయింది. ఇన్ని లంకణాలు చేసినా నాకు తెలియదు. ఏ చిన్న కుర్రాడితో కబురు పంపినా ఒక పాతిక రూపాయలు ఇవ్వకపోదునా ! అబ్బే వాడు ఎలా అడుగుతాడు ! అభిమానం ఎక్కువ. అసలు కూలిపని లోకి వచ్చినపుడే అడిగేవాడు కాదు. ఇస్తే పుచ్చుకోవటం – లేకపోతే లేదు. ఇవిగో ఈ యాభై పట్టుకెళ్ళి పుల్లలుగట్రా చూడండి.” అంటూ మళ్లీ కళ్ళు తుడుచుకున్నారు ధర్మయ్య గారు.

“మారాజులు యిట్టే వచ్చి అట్టే యాభై రూపాయ లిచ్చారు.

“ముందే ఓ వంద అడిగి వుంటే యీడికి చావు రాకపోనుగదా.”

…. ధర్మయ్య గారి ధర్మగుణాన్ని ప్రజలు ఆశ్చర్యపోతూ చెప్పుకున్నారు.

ఈ సారికూడా ఎలక్షనులో ధర్మయ్య గారే గెలిచారు. అందుకు కారణం – ‘అయన ఔదార్యం. సాటిమనిషిని కన్నబిడ్డలా చూసే తత్వం. ఆయన గుణమే గుణం – ధర్మగుణం’ అన్నారు ప్రజలంతా.

కాని ఒక తూరీగ మాత్రం – ‘ఆయన గుణం మీకేం తెలుసు, బ్రతికినంత కాలం సుబ్బయ్య శక్తిని జలగలా పీల్చాడు. తీరా చచ్చిన తరువాత వాడి శవానికి ఏభై రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రజల అభిమానాన్ని కొన్నాడు’ —- అంటూ తుర్రున ఎగిరిపోయింది.

అన్న దమ్ములు – చిన్న కథ

వైకుంఠం విష్ణుమూర్తి ఉదయాన్నే మా ఇంటికొచ్చాడు. వీడి ఇంటి పేరు వైకుంఠం. వీడి పేరు విష్ణుమూర్తి. వీడు నేను ఒకే స్కూల్లో మాష్టర్లం. మామధ్య మంచి దోస్తి ఉంది. ‘ఏరా’ అంటే ‘ఏరా’ అనుకునేంత స్నేహం మాది. దీనికి కారణం మేము ఒకే స్కూల్లో పనిచేయటం కాదు. మేము బాల్య స్నేహితులం. కాకపోతే వీడికంటే నేను కాస్త వయసులో పెద్దవాడిని. వీడిని మేమంతా వి.వి.మూర్తి అని, విష్ణు అని, సింపుల్ గా మూర్తి అని పిలుస్తుంటాం.

వీడి పేరు వినే మా ‘స్టాఫ్’ అంతా నమస్కారాలు పెడుతూ ఉంటే మా సిస్టర్ అంటే వీళ్ళావిడ పేరు ‘శ్రీమహాలక్ష్మి’ కావటం మరింత గందరగోళానికి, కడుపుబ్బ నవ్వుకోవటానికి కారణమయింది. “ఈరోజు శ్రీమహాలక్ష్మి మా గడప తొక్కిందమ్మా” అంటూ ఇరుగుపొరుగు ఆడవాళ్ళు ఆమెమీద జోకులేస్తూ సరదాగా కాలక్షేపం చేస్తుండేవారు.

ఇంతకీ వీడు ఇంత పొద్దున్నే మా ఇంటికెందుకొచ్చాడో నాకు అర్ధం కాలేదు. వాడిని అడగటానికి నాకేమి మొహమాటం లేదుకదా!

“ఏరామూర్తి ఇంత పొద్దున్నే వచ్చావ్ – ఏంటి విశేషం” అన్నాను.

వాడు విషయం చెప్పకుండా భోరున ఏడవటం మొదలు పెట్టాడు. దానితో నాకు కాస్త కంగారు పుట్టింది. ఆ శ్రీమహాలక్ష్మికి ఎమన్నా అయిందేమో అని !

“ఏరా ! ఏమయింది? ఎందుకా ఏడుపు ! శ్రీమహాలక్ష్మి కులాసాయే కదా” ? అన్నాను.

ఈ ప్రశ్నతో మావాడి ఏడుపు ఠక్కున ఆగిపోయింది.

“ఏరా ! నేను ఏడుస్తా ఉంటే దాని సంగతి అడుగుతా ఉన్నావ్” అన్నాడు. ఆ గొంతులో ఏడుపో, కోపమో ఏదీ అర్ధం కావటం లేదు.

“అవున్రా ! నువ్వేడ్చేదంతా అమెకోసమే కదా!” అన్నాను. కాస్త రెట్టించి. ఆమాట పుండు మీద కారం చల్లినట్టయింది వాడికి.

“అంటే నేనెప్పుడూ దానికోసమే ఏడుస్తుంటానా?” అన్నాడు మూర్తి. ఈసారి వాడి గొంతులో కోపం స్పష్టంగా తెలుస్తోంది.

“అవును – నువ్వేంటి ! ఎవరైనా పెళ్ళాం బిడ్డల కోసమే కదా ఏడుపంతా!” కాస్త జోక్ గా మాట్లాడితే వాడికి త్వరగా మాములు మనిషిని చేయొచ్చని నా అభిప్రాయం.

“నోరుమూసుకో ! వెధవ జోకులూనువ్వునూ ! దానికే అది నిక్షేపంగా ఉంది. నాకేవచ్చింది ఈ ఏడుపంతా !” అని మళ్లీ మూగరోదనలోకి, విషాదమౌనంలోకి వెళ్ళిపోయాడు.

అప్పుడర్ధమయింది – వీడికి, వీడి భార్యకి ఏదో గొడవ జరిగి ఉంటుందని. కోపం వచ్చినపుడే వీడు పెళ్ళాన్ని ‘అదీ’ ‘ఇదీ’ అంటాడు. మాములుగా ఉన్నపుడు పేరుపెట్టే పిలుస్తాడు.

“కాస్త సరిగా చెప్పి ఎడ్వవోయ్ ! ఏంటి శ్రీమహలక్ష్మితో గొడవపడ్డావా ?” అన్నాను.

“ఏవుంది ! మా వెధవ ఉన్నాడుగా !”

“ఎవడా వెధవ ! ఈ లోకంలో చాలామంది వెధవలున్నారు. ఇంతకీ ఈ వెధవ ఎవడో సరిగా చెప్పి ఏడు.”

“ఇంకెవరు – మా తమ్ముడు వెధవ”

“కిష్టమూర్తి సంగతా ! అదీ అసలు విషయం. సరే ఎంత తమ్ముడైనా – వెధవ అంటే ఎలా? వాళ్ళ ఆవిడ – అంటే – మీ మరదలు వింటే పోట్లాడదూ ?”

“ఎందుకు పోట్లాడదూ ! రోజూ ఏదో ఒక పోట్లాట ! ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి కదా – మేమిద్దరం బాగానే ఉన్నాం – ఈ ఆడోళ్ళ గోలే ఎక్కువయింది.”

“ఏంటాగోల ? నీ ఏడుపుకి కారణం స్పష్టంగా రెండు ముక్కల్లో చెప్పు” అన్నాను.

“ఏం చెప్పమంటావ్ ? ఈ ఆడోళ్ళ మాటలకి అర్ధం ఉండదు. మా తమ్ముడికి లాటరీలో లక్షరూపాయలు వచ్చాయట. ‘నువ్వూ ఉన్నావ్ ఎందుకు. నెలజీతానికి ఏడవ్వలిసిందే ! ముష్టి మూడువేలరూపాయల ఉద్యోగం ! ఎన్నాళ్ళు సంపాయించాలి లక్ష !’ అంటుంది. దానితో నాకు ఒళ్ళుమండి ‘నోరుమూస్కో’ అన్నాను. దానితో ఇంకా రెచ్చిపోయింది. అవున్లే ! నీకదే చేతనౌను. నీలాంటి చేతగాని వాడితో కాపురం చేసే కంటే రౌడీతో కాపరం చెయ్యటం సుఖం’ అంటుంది. అంటే మా తమ్ముడు రౌడీ అనీ, వాడి పెళ్ళాం సుఖపడుతోందనీ, వాడు నాకంటే బెటరని దాని ఉద్దేశం.

“అబ్బా ! మా సిస్టర్ నిన్ను చాలా మాటలంది. మరి ఓ లక్ష సంపాదిస్తే పోలా – యిలా ఏడుస్తూ కుర్చోపోతే” అన్నాను.

“ఒరే మాధవా ! జోకులాపు ! నాకు ఎంత బాధగా ఉంది ! మా తమ్ముడంటే – వాడికి చదువు అబ్బలేదు. ఏదో ఆ ఎం.ఎల్.ఏ గారి వెనకాల తిరుగుతూ రౌడీయిజం చేసుకొని బతుకుతున్నాడు. వాడికి నాకు పొంతన ఎలా కుదురుతుంది ? వాడి జీవితం వేరు. నా జీవితం వేరు. వాడు లక్ష ఎలా సంపాదించాడో వాడికే తెలవాలి. అసలు లాటరీలు ఎక్కడ ఉన్నాయి ? అదేవిటో మనకి తెలీదు. ఈ ఆడవాళ్ళకు ఎక్కడ లేని ‘రూమర్లు’ అందిపోతాయి.


విష్ణుమూర్తి, కృష్ణమూర్తి అన్నదమ్ములు. వీళ్ళది చాలా పేద కుటుంబం. వీళ్ళ కుటుంబం గురించి నాకు బాగా తెలుసు.  చిన్నప్పుడు వీళ్ళనాన్న ఏదైనా తింటానికి పట్టుకొస్తే వీళ్ళ తమ్ముడు తనకు పెట్టింది తినేసి యింకా కావాలని ఏడ్చేవాడు. కలబడి వాళ్ళ అన్న చేతిలోది లాక్కొనేవాడు కూడా ! విష్ణుమూర్తి ఏడుపు మొదలు పెట్టేవాడు. వాళ్ళ అమ్మ వచ్చి ‘తమ్ముడు కదా ! నీకంటే చిన్నోడు కదా ! వాడినే తిననియ్ ! నీకు రేపు బోళ్ళన్ని అప్పచ్చిలు  చేసి పెడతాను’ అని సర్దిచెప్పేది.

పిల్లలు కాబట్టి ఆ విషయాలు అప్పుడే మరిచి పోయే వాళ్ళు. అన్నయ్య తినేది తానూ లాక్కోకూడదనే ‘నీతిశాస్త్రం’ తమ్ముడికి తెలీదు. తన చేతిలోది తమ్ముడికెందుకివ్వాలి ! అన్న ‘తర్కం’ అన్నకూ లేదు. పైగా వాళ్ళ మధ్య సంధానకర్త ‘తల్లి’ మాత్రమే ! ఇతరుల ప్రమేయం ఉండదు కాబట్టి తన కన్నబిడ్డలను తాను చక్కదిద్దుకోనేది. ఎవరిలోను ‘నెగెటివ్’ భావాలు రాకుండా ప్రేమ మాత్రమే నిలిచేటట్లు చూసుకొనేది.

వీళ్ళు పెరిగి పెద్దయిన తరువాత – భార్యలు వచ్చిన తరువాత – జీవిత స్వరూపం ఎంతో మారిపోయింది ! నాది, నీది… అనే విచక్షణ పెరిగింది. జీవితంలో బ్రతుకుతెరువు కోణం ప్రధానమయ్యేసరికి ‘ప్రేమ’ కోణం తగ్గుతూ వచ్చింది.ఎవరిది వాళ్ళు సరిచేసుకోవాలనే ధోరణి పెరిగిపోయింది.

వీళ్ళకొక మిద్దె ఇల్లు ఉండేది. వీళ్ళనాన్న చనిపోయిన తరువాత దానిని అమ్మేశారు. దానిమీద వచ్చిన ఇరవైవేలు వీళ్ళ తమ్ముడే కాజేసి పెళ్ళానికి గొలుసు చేయించాడని విష్ణుమూర్తి భార్యకు లోపల్లోపల సెగరేగుతోంది. పెద్దాయన చదువుకొని ఉద్యోగస్తుడయ్యాడు. డబ్బంతా అయన చదువుకే పెట్టారు. మా ఆయన బండోడు. ఆయనకు చదువులేదు. ఈ డబ్బు తీసుకుంటే తప్పేముంది” అని కృష్ణమూర్తి పెళ్ళాం వాదన.

నిజానికి ఆ డబ్బు అప్పులు తీర్చటానికే సరిపోయిందన్న సంగతి ఆడవాళ్ళు నమ్మరు. వెయ్యో, రెండువేలో మిగిలితే అవి కృష్ణమూర్తి తీసుకొని ఉండవచ్చు. ఏదో కిందామీదాపడి వాళ్ళావిడకు గొలుసు చేయించాడు. అక్కడి నుండి ఎన్నో అపోహలు, అపార్థాలు చోటుచేసుకుంటూ ఈ రెండు కుటుంబాల మధ్య అంతరం పెరిగిపోయింది.

చిన్నప్పుడు ఉన్న ప్రేమలు పెద్దయాక ఉండవు. ఇదే విష్ణుమూర్తి చిన్నప్పుడు వాళ్ళ తమ్ముడిని మోయలేకపోయినా ఎత్తుకొనేవాడు. వాడు తనకంటే చిన్నవాడని, వాడు నడిస్తే కాళ్ళు నొప్పెడతాయని భావించేవాడు. వాడి బాధను తన బాధగా స్వీకరించేవాడు. ఎవరైనా తమాషాకి - 

“ఏరా విష్ణు ! మీ తమ్ముణ్ణి మాకిస్తావా ?” అని అడిగితే “నేనివ్వను – మా… తమ్ముడు” అని చెప్పి వాడిని ఇంకా దగ్గరకు తీసుకుని ముద్దులు పెట్టుకునేవాడు. కృష్ణమూర్తి కూడా అంతే “ఏరా మీ అన్నను మేం తీసుకుపోతాం” అంటే వాడు ‘రాయి’ తీసేవాడు. మా అన్నను ముట్టుకున్నారంటే చంపేస్తాను అన్నట్టుగా ఉండేది వాడి ధోరణి.

ఆ ప్రేమలు, ఆప్యాయతలు ఇప్పుడేమయిపోయాయి ? వీళ్ళే కాదు – లోకంలో అన్నదమ్ముల సంబంధాలు ఎందుకిలా మారిపోతాయి ?

‘ఒరే విష్ణు ! నీ తమ్ముడి సంగతి నీకు తెలియందేముంది ! మీరు ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. ఇహ మీ తగాదాలు ఎందుకు ? సిష్టర్ తో మాట్లాడదాములే నువ్వు బాధపడకు’ అని వాడిని సముదాయించాను..

ఇంతలో మా స్కూలు అసిస్టెంట్ శివారెడ్డి ఫైలు తీసుకువచ్చాడు. నేనే అతన్ని ఉదయాన్నే ఫైలు తెమ్మని చెప్పాను. కాస్త రిటెన్ వర్కు ఉంటే చేద్దామని. మరీ ఇంత ఉదయాన్నే వస్తాడనుకోలేదు. అతన్ని కూర్చోమని చెప్పి ఇద్దరికీ కాఫీ ఇచ్చాను. మా ఆవిడ పుట్టింటికెళ్ళింది. అందుచేత ఇంట్లో అన్ని పనులు నావే ! కాఫీ తాగుతూ ఉండగా అడిగాను.

“ఎం శివారెడ్డి ! నీకు అన్నదమ్ముల గొడవలున్నాయా?”

“వాఅమ్మో ! ఆ సంగతి అడగకండి సార్ !”

“ఏం – ఏంటి అంత భయపడుతున్నావ్ ?”

“భయమే సార్ ! మేం ఐదుగురం అన్నదమ్ములం. నేను చిన్నోడిని. మమ్మల్ని పంచపాండవులనేవోళ్ళు. కానీ ఆ రోజులు మారిపోయినయ్. ప్రస్తుతం మా అన్నలు ఒకరి మీద ఒకరు కత్తులు నూరుతున్నారు. ఎవరి మధ్య సత్సంబంధాలు లేవు. కొందరు ఉన్నట్టు నటిస్తారు. కొందరు పూర్తిగా దూరమయ్యారు.

మా పెద్దన్నయ్య కూతురు ఇంజనీరింగ్ నాలుగేళ్ళు చదివితే, అదే వూళ్ళో ఉన్న మా మూడో అన్న, వదిన దాన్ని చూడటానికి వెళ్ళలేదు. దాని బర్త్ డే తెలిసి కూడా ఒక్క సంవత్సరం కూడా అభినందనలు చెప్పలేదు. ఇది మా పెద్దన్నయ్యకు,వదినకు కోపం.

నా పెళ్లి కుదిర్చినవాడు మా రెండో అన్నయ్య. మా పెద్దన్నయ్యతో నా పెళ్లి విషయం సరిగా సంప్రదించలేదని… ఈ వ్యవహారం ‘యిలా’ చెయ్యటంతో వాడి ‘స్వార్ధం’ ఏదో ఉందని వీళ్ళు అనుకుంటారు. 

మా నాలుగో అన్నయ్యకి ఉద్యోగం ఇప్పించింది మా రెండో అన్నయ్యే ! ఈ విషయాన్ని మా రెండో వదిన వాళ్లకి జీవితాంతం గుర్తుచేస్తా వుంటాది. “మా అయన ఉద్యోగం యిప్పించకపోతే మీ అయన అడుక్కుతినేవాడు” అని మా నాలుగో వదినతో అనటం ఆమె సహించలేకపోయేది. “అవును నా మొగుడు సిగ్గులేకే ఈ ఉద్యోగం చేస్తున్నాడు” అని ఆ రాత్రికి మా అన్నయ్యతో తగాదా వేసుకొనేది.

ఇలా ఎన్నని చెప్పమంటారు ! చెప్పలేనంత చండాలంగా ఉండే విషయాలు కూడా చాలా ఉన్నాయి. అనేక అపోహలు, అపార్థాలు, అర్థ సత్యాలతో వీళ్ళ హృదయాలు లుకలుక లాడిపోతున్నాయి. అందరు నాశనమయిపోయి వాళ్ళు, వాళ్ళ పిల్లలు మాత్రమే అభివృద్ధికి రావాలని దేవుడికి కొబ్బరికాయలు కొట్టిన వాళ్ళున్నారు. మీరు నమ్మొచ్చు – నమ్మకపోవచ్చు ! మనుషులెందుకిలా జీవిస్తున్నారో నాకు అర్ధం కావటంలేదు సార్!” అంటూ ఏడ్చాడు శివారెడ్డి.

అతని భుజం తట్టి ‘బాధపడొద్దు’ అన్నాను. అతను కళ్ళు తుడుచుకొని మాములు అయిపోయాడు.

“చుసావట్రా మూర్తి ! అన్నదమ్ముల తగాదా నీకొక్కడికే కాదు చాలామంది ఇలాంటి బతుకే బతుకుతున్నారు. నా సంగతి కూడా చెబుతాను వినండి” - 

మా అబ్బాయి అమెరికా వెళ్ళాడని, అక్కడే పెళ్లి చేసుకున్నాడని తెలిసి మా అన్నయ్య ఎంత అసూయ పడ్డాడని ! మా వాడి పెళ్లి ఫోటోలు ఇంటర్నెట్లో చూద్దాం రమ్మంటే ‘వస్తాలే’ అని రాకుండా వెళ్ళిపోయాడు. స్వార్ధపరుల్నైనా క్షమించచ్చు గాని, అసూయపరుల్ని అసలు క్షమించలేం” ఈ మాటలు అంటున్నప్పుడు నాలో ఉద్రేకం పెరిగింది. అది గ్రహించి నాకు నేనే ఒక్క క్షణం మాట్లాడటం ఆపేసాను. కొన్ని క్షణాల మౌనం తరువాత యిలా అన్నాను.

“మనమే కాదు. పురాణకాలం నుంచి యిదే పరిస్థితి. భీముడికి విషంపెట్టి చెరువులోకి తోసారు. ధృతరాష్ట్రుడు భీముణ్ణి తన ఉక్కు బాహువుల్లో బంధించి తునాతునకలు చెయ్యాలనుకున్నాడు.కైకేయి తన కొడుకు మీద ప్రేమతో రాముణ్ణి అడవులకు పంపాలని కోరింది.

పురాణకాలమే కాదు – ఇప్పుడు కూడా మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అతని తమ్ముడు రామ్మూర్తినాయుడు, ముఖేష్ అంబానీ – అనిల్ అంబానీ, అమితాబ్ అతని తమ్ముడు అజితాజ్… వీళ్ళంతా సమాజంలో పై స్థానాల్లో ఉన్నారు. అయినా అన్నదమ్ముల పోరు తప్పలేదు. మరికాస్త భావోద్రేకం పెరిగి ప్రవీణ్ మహాజన్ – తన అన్న ప్రమోద్ ను క్రూరంగా పిస్టల్ తో కాల్చి అన్నదమ్ముల తగాదాల్లో కొత్త కోణం తెరచాడు.

ఒరే విష్ణు – ఇవి అన్ని విన్న తరువాత నీకేమనిపిస్తోంది. దీంట్లో నువ్వు బాధపడాల్సిందేమీ లేదు. నీ తమ్ముడు లక్ష సంపాయించాడని అసూయపడితే లాభం ఏముంది? ఎవరి బ్రతుకులు వాళ్ళు ఉద్రేకపడకుండా జీవించాలి” అన్నాను నేను.

మా శివారెడ్డి అనుభవము, నా అనుభవము విన్న తరువాత మా మూర్తి కాస్త తేరుకుని - 

“మానవసంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలేనని ఎవరో పెద్దమనిషి అన్నట్టు విన్నాను. కానీ ఎవడి ఆర్ధిక వనరులతో వాడు జీవిస్తూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు కుళ్ళిపోతున్నారు ఎందుచేత ?” అన్నాడు.

ఎక్కడో మనుషుల్లో దాక్కున్న ఈర్ష్య, అసూయలు చెలరేగి ఇలాంటి పరిస్థితి తెచ్చిపెడుతున్నాయి. ‘రక్తసంబంధం’ సినిమాలో ఆ అన్నాచెల్లెళ్ళు ఎందుకు చచ్చిపోయారు ? వాళ్ళ దోషం ఏమిలేదు. సూరేకాంతం అసూయ వాళ్ళను బలితీసుకుంది. అలాగే అన్నదమ్ముల సంబంధాల్లో కూడా తెలియని సూరేకాంతాలు, నాగభూషణాలు ఎందరో ఉంటారు. కొంపకు నిప్పెట్టేసి వాళ్ళు మెదలకుండా కూర్చుంటారు. మంధర మాట వినేగా కైక రాముణ్ణి అడవులకు పంపింది. ఇవన్ని బాహ్య కారణాలయితే అంతర్గత కారణాలు చాలా ఉంటాయి. మన సంప్రదాయాలు దెబ్బ తినటం దీనికొక కారణం. మనిషిలోని ఆశ అత్యాశగాను, దురాశగాను మరి మానవత్వం నశిస్తోంది.ముఖ్యంగా పాశ్చాత్య (సామ్రాజ్యవాద) సంస్కృతి మనలను మరింత హీనులుగాను, ఏకాకులుగాను మార్చేస్తోంది” అన్నాను నేను.

శివారెడ్డి కాఫీ పూర్తిచేసి “వెళతాను సార్, మీ దగ్గరకు వచ్చి చాలా విషయాలు తెలుసుకున్నాను. కాస్త మనసు తేలికపడింది. అయినా ఈ గొడవలన్నీ మనతరం తోనే ఆఖరు. రాబోయే తరంలో అన్నదమ్ములే ఉండరులెండి. ఇప్పుడు అందరికి ఒక్కరు లేక ఇద్దరేగా ! ఆ ఇద్దరిలో ఒకరు అమ్మాయి ఒకరు అబ్బాయి. ఇహ తన్నుకునే అవకాశం లేదు. ముందు ముందు – నాకొక అన్న ఉంటే బాగుండును, నాకొక తమ్ముడుంటే బాగుండును అనుకునే రోజులు వస్తాయి” అన్నాడు.

అతని మాటలు అక్షర సత్యం అనిపించాయి.

విష్ణుమూర్తి కాస్త తేరుకున్నాడు. ఆ రోజంతా నాతోనే ఉన్నాడు. ఆదివారం కావటం వల్ల అనేక విషయాలు మాట్లడుకో గలిగాం. నా ఫైలు పనంతా పూర్తి చేశాను. ఆ సాయంత్రం ఇద్దరం కలిసి శ్రీమహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవటానికి వాళ్ళింటికి బయలుదేరాం.


అమానుషం

అదొక కార్పొరేట్ స్కూల్. ఆంధ్ర దేశంలో అరవై బ్రాంచీలతో దిగ్విజయంగా నడుస్తోంది. ఏ బ్రాంచి చూసినా వేలకొద్దీ పిల్లలు. ఐఐటి కోచింగ్, కంప్యూటర్ లెర్నింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్స్ తో సోఫిస్టికేటెడ్, అడ్వాన్స్`డ్ ఎడ్యుకేషన్ అందిస్తున్నట్లు ప్రచారహోరు. కాన్సెప్ట్ టెక్నో సూపర్ మెగా స్కూలు అంటూ గొప్ప పేరు. పెయింటింగ్, చెస్, యోగా…. మొదలైన సర్వకళా నిలయమంటూ వాళ్ళు ప్రదర్శించే తీరు…ఓ…న భూతో న భవిష్యతి. ఇంకా ఎన్ని విశేషణాలు దొరికితే అన్ని విశేషణాలతో ఈ స్కూలు పేరు క్రింద సబ్ టైటిల్స్`గా అతుక్కుపోతాయి.

ఇప్పుడిది కార్పొరేట్ స్కూళ్ళ యుగం. డ్రస్ మెటీరియల్(యూనిఫాం) దగ్గరనుండి స్టడీ మెటీరియల్ వరకు ఎ టు జడ్ వీరే అందిస్తారు. టైం మెయింటెనెన్స్ లో వీరికి వీరే సాటి! ఉదయం నాలుగు గంటలకు మేలుకొలుపు గీతాలు. రాత్రి తొమ్మిది గంటల వరకు చదువు. స్టడీ అవర్స్ నడపడంలో వీరికి వీరే సాటి. మ్యాథ్స్ ఎనాలిసిస్`లో తమకు సాటి మరొకరు లేరన్న ప్రచారం. పాఠశాల భవన నిర్మాణం చూస్తే ఆనాటి మయసభ, ఈనాటి స్టార్ హోటళ్ళు, హైటెక్ భవనాలు దాని ముందు దిగదుడుపు.

ఇంతటి పబ్లిసిటి ఉన్న ‘గొప్ప’ స్కూల్లో ఉద్యోగం చేస్తున్నందుకు ఆనందరావు ఆనందం ఇంతా అంతా కాదు! ‘డెమో’ పూర్తిచేసి ఉద్యోగం ‘ఓకే’ అయిన తరువాత తనకు డి.యస్.సి. రానందుకు పడుతున్న బాధనంతా మరచిపోయాడు. ప్రారంభంలోనే పదివేల జీతం! ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం వస్తే మాత్రం ఏముంది! రెండువేలతో సరిపెట్టుకోవాలి. ఆ తరువాత పదివేలకు రీచ్ అవ్వాలంటే ఐదేళ్ళు పడుతుంది. అదేకాలంలో ఇక్కడ… ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్లు… పదిహేడు పద్దెనిమిది  వేలు మంత్లీ డ్రా చేయవచ్చు. పైగా ఎక్స్ ట్రా అవర్స్ చేస్తే ఎక్స్ ట్రా మనీ…ఓహో…అనుకున్నాడు ఆనందరావు.

కాని-

ఇతని ఆనందం నీరుకారిపోవటానికి ఎంతోకాలం పట్టలేదు. రెండు నెలల్లో అంతా అర్ధమయ్యింది. పైన పటారం లోన లొటారం! తల్లితండ్రులను ఆకర్షించడానికి చేసే ప్రయత్నాలే తప్ప ‘విద్యార్థి ‘ ఎలా పోయినా వీళ్ళకు అక్కరలేదు. ఇక్కడి ఉపాధ్యాయులు యాజమాన్యం ఎలా ఆడిస్తే అలా ఆడే ఆటబొమ్మలు మాత్రమేనని తెలుసుకున్నాడు.

ప్రభుత్వ పాఠశాలల్లో లేని ‘ఆకర్షణ’ వీళ్ళు చూపిస్తారు. ప్రభుత్వం ఇంత అందమైన భవనాలను కట్టగలదా? ఎ.సి.లు పెట్టగలదా? కెమెరాలను అమర్చి ఉపాధ్యాయుల పనిని వాళ్ళకు అనుకూలంగా నియంత్రించగలదా! పత్రికల్లో టివీల్లో వ్యాపార ప్రకటనలు ఇచి విద్యార్ధులను రాబట్టగలదా? అతి తక్కువ సెలవులతో స్కూళ్ళు నడపగలదా? ఆ సెలవుల్లో కూడా ఉపాధ్యాయులను స్కూలుకు రప్పించి ఏ పనీ లేకుండా బంధించగలదా?

పేదా-సాదా, కులం-మతం  తేడా లేకుండా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తాయి. లౌకికరాజ్యం కదా! కాని కార్పొరేట్ స్కూళ్ళు అలాకాదు. కులమతాల ప్రశ్న పైకి కనపడదు. కాని ఇవి డబ్బున్న వారికి మాత్రమేనన్నది సుస్పష్టం.

ప్రతి పదిహేనుమంది విద్యార్ధులకు ఒక వార్డెన్ ఉంటాడు. టీచర్స్`తో పాటు కేర్ టేకర్స్, సూపర్వైజర్లు, అకడమిక్ అబ్జర్వర్లు, కో ఆర్డినేటర్లు, ఇన్-చార్జీలు…వామ్మో…యిదంతా ప్రభుత్వ స్కూళ్ళలో ఎందుకుంటుంది! అందుకే ‘జనం’ ఈ దారి పట్టారు.

డబ్బున్నవారితో పాటు మధ్యతరగతి వారు కూడా! మనకొక సామెత ఉందికదా! ఒక గొర్రె ఏ దారి పదితే మిగిలినవన్నీ అదే దారి. ముఖ్యంగా ‘ఇంగ్లీషు’ ఆకర్షణ వారిని ఇటు నడిపిస్తోంది. నేతి బీరకాయలో ‘నెయ్యి’ ఉండదన్న సంగతి గ్రహించడానికి ఆనందరావుకు రెండు నెలలు పట్టింది. కాని ఈ సత్యాన్ని తల్లిదండ్రులు గ్రహించాలంటే వాళ్ళు ఈ స్కూళ్ళకు వచ్చి చూడాలి కదా! కాని అంత ప్రత్యక్షంగా చూడటానికి వాళ్ళకు అవకాశం ఏది? రిసెప్షన్ వద్దే ఆగిపోవాలి. వర్కింగ్ అవర్స్`లో వస్తే పేరెంట్స్ రూం`లో వెయిట్ చెయ్యాలి. ఎనౌన్సర్ మైక్`లో ఆ విద్యార్ధి పేరు చెబుతూ ‘యువర్ పేరెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యు అని రెండు మూడుసార్లు అరుస్తాడు. ఆ మైక్`లో తమ పుత్రరత్నం పేరు వినగానే ఇక్కడి తల్లిదండ్రుల హృదయాల్లో ఉద్వేగం, పుత్రోత్సాహం ఉరకలు వేస్తుంది. అల వైకుంఠపురంబులో.. అన్నట్లుగా ఐదంతస్తుల మేడదిగి వస్తాడు పుత్రుడు. యూనిఫాంతో, బెల్టు, టై, షూస్`తో వస్తున్న పుత్రుణ్ణి లేక పుత్రికను చూసిన కన్నవారికి కన్నీరో పన్నీరో తెలియని బాష్పాలతో కనుకొలకులు నిండిపోతాయి. అది చాలు వారికి-అక్కడ వాడు ఏం చదువుతున్నాడో తరువాత విషయం!

ఆ తరవాత విషయాలన్నీ ఆనందరావుకు బాగా తెలుసు. తరగతి గదుల్లోను, హాస్టల్ రూంలోను  సూపర్వైజర్లు, వార్డెన్లు వారిని ఎంత అమానుషంగా హింసిస్తారో తాను కళ్ళారా చూశాడు కదా!

ఒక విద్యార్ధికి ఫస్టు యూనిట్లో మార్కులు సరిగా రానందుకు ఒక సూపర్వైజర్ తన ప్రక్కనే ఉన్న ప్లాస్టిక్ కుర్చీ ఎత్తికొట్టాడు. “ఎవడి సంక నాకుతున్నావమ్మా “(ఇదే వీరి లోపలి ఇంగ్లీషు) “ఈసారి బాగా రాకపోతే నీకు టి.సి. ఇచ్చి పంపేస్తాం.” ఆ కృతకమైన, అశ్లీలమైన భాష వినలేక ఆనందరావు ఎంతో బాధపడుతూ ఉండేవాడు.

ఒకసారి ఒక సూపర్వైజర్ – బాతుని మెడపట్టుకుని పైకి లేపినట్టు ఆరవ తరగతి విద్యార్ధి మెడపట్టుకుని పైకి లేపాడు. వాడు చచ్చిపోతాడేమో అనుకున్నాడు ఆనందరావు. ఎదురుగా ఉన్న క్లాసులో నుండి చూస్తూ – ఇక చూడలేక “దింపవయ్యా! చచ్చిపోతాడు” అని గట్టిగా అరిచాడు.ఆయన ‘అరుపు’ తో వదిలాడేకానీ లేకపోతే మరికొంతసేపు పట్టుకునేవాడే! విచిత్రం ఏమిటంటే అలా అరిచినందుకు సూపర్వైజర్ నుండి కంప్లైంట్ వెళ్ళింది. ప్రిన్సిపల్ ఆనందరావును పిలిచి ఫస్టు వార్నింగ్ ఇచ్చాడు-’అదంతా నీకు అనవసరం’ అని!

చూసేవాడి స్థితి అలా వుంటే అనుభవించే వాడి పరిస్థితి ఏంటి? ఇలాంటి హింసలు భరించలేక కొందరు పిల్లలు గోడలు దూకడం, మేడలు దూకడం, ప్రాణాలు వదలటం జరుగుతోంది.

పిల్లల్ని కొట్టకూడదనే రూల్స్ ఉంటాయి. ఉపాధ్యాయుడు కొట్టకూడదు. సూపర్వైజర్లు కొట్టవచ్చు. కాలం మారింది ఉపాధ్యాయుడి చేతిలో నుండి సూపర్వైజర్ చేతిలో పడ్డాడు విద్యార్ధి!

అక్కడి శిక్షలు చూసి ఆనందరావు గజగజలాడటం మొదలుపెట్టాడు. అయినప్పటికి ఆ అమానుష చర్యలు చూసి తనకెందుకులే అని సరిపెట్టుకోలేకపోయాడు. అప్పుడప్పుడు ‘అడ్డుకొని’ ప్రిన్సిపల్ చేత చీవాట్లు తింటూనే వున్నాడు.

ఇలాంటి భౌతిక హింసలను ప్రక్కన పెడదాం. మానసిక హింసలు ఎలా ఉంటాయో చూద్దాం. ఒక్క అక్షరం తప్పు వ్రాస్తే ఆ పేజీ అంతా ముప్ఫైసార్లు ఇంపోజిషన్ వ్రాయాలంట. రాత్రి నిద్రమానుకుని కునికిపాట్లు పడుతూ వాడు వ్రాస్తాడు. ఈసారి ఇంకా తప్పులు వ్రాస్తాడు. శిక్షలు ఇంకా పెరిగిపోతూ ఉంటాయి.

అక్కడి ఆర్గనైజర్ల ‘భాష’ ఎంత గొప్పగా ఉందో మనం చూసాం. ‘వీళ్ళు’ విద్యార్ధుల్ని ఇంగ్లీషులో మట్లాడమంటారు. తెలుగులో మాట్లాడితే ‘ఫైన్’ వేస్తారు. హాస్టల్లో ఉండే చాలామంది పిల్లలు పల్లెటూళ్ళ నుండి, రైతు కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళే! వాళ్ళ ‘ఇంగ్లీషు’ అంతంత మాత్రం. ఇది ఎంత మానసిక హింసో చెప్పలేం! వీళ్ళు చేరేటప్పుడు కొంత సృజనాత్మకంగాను, చైతన్యవంతంగాను ఉంటారు. ఇక్కడి వాళ్ళ హింసతో సర్వశక్తులూ కోల్పోతారు.

రోజులు గడుస్తున్నాయి. ఎవరు ఎలాపోతే తనకెందుకులే అన్న స్థితికి వచ్చేశాడు ఆనందరావు. వచ్చేటట్లు కంట్రోల్ చేశారు.

ఒకరోజు – ప్రిన్సిపల్ పిలిపించాడు. క్లాసులో ఉన్న ఆనందరావుకు ఏంటో అర్ధం కాలేదు. ఈ మధ్యకాలంలో తాను ఎలాంటి అడ్డంకులూ పెట్టలేదు. వాళ్ళు కొట్టుకున్నా తిట్టుకున్నా తనకు అనవసరం అని ఊరుకున్నాడు. ఒక ఇన్-చార్జ్ ప్యాడ్`తో విద్యార్ధిని కొడితే అతని తలకు గాయమైంది. మూడుకుట్లు పడ్డాయి. ఆనాడు ఆనందరావు బాధను దిగమింగాడేగాని ఎదురు చెప్పలేదు. ఇంత నిశ్శబ్దంగా తాను తన పని చేసుకుపోతున్నా సరే – ప్రిన్సిపల్ తనను ఎందుకు పిలిపించినట్లో???

ఆలోచిస్తూనే ప్రిన్సిపల్ రూంలోకి అడుగుపెట్టాడు. అక్కడ ప్రిన్సిపాల్ తప్ప ఇంకెవ్వరు లేరు.

“రా! కూర్చో!” కుర్చీ చూపించాడు ప్రిన్సిపాల్.

ఈ మర్యాద ఏంటో అర్ధంకాలేదు ఆనందరావుకు. మెదలకుండా కూర్చున్నాడు.

“సిలబస్ ఎంతవరకు వచ్చింది” అడిగాడు ప్రిన్సిపాల్.

“ఇంకొక్క పాఠంతో సిలబస్ పూర్తి అవ్వుద్ది” అన్నాడు ఆనందరావు.

“ఆనందరావ్! నువ్వంటే పర్సనల్`గా నాకు ఇష్టమే. కాని అనవసరంగా రిస్క్`లో పడుతున్నావు”

“నాకు తెలిసి ఈ మధ్య కాలంలో నేను ఎలాంటి రిస్క్ తీసుకోలేదు.”

“నీకు తెలియకుండా తీసుకోవచ్చుగా” అన్నాడు ప్రిన్సిపాల్ చాలా తెలివిగా అన్నానని మురిసిపోతూ!

“తెలియనప్పుడు నేనెలా చెప్పగలను?”

“అందుకే- నిన్ను కూర్చోబెట్టి చెబుదామని పిలిపించాను”

“ఏంటది?”

“శ్రమదోపిడి గురించి పాఠం చెప్పావటగా!”

“అవును, అది సిలబస్`లో ఉన్నదే”

“ఉండవచ్చు. అంత లోతుగా చెప్పటం ఎందుకు!”

“లోతుగా చెప్పటం ఏమిటి? ఆ రచయిత ఆ పాఠాన్ని ‘శ్రమదోపిడీ’ ప్రధానాంశంగా వ్రాసాడు. అలాంటప్పుడు ఆ ‘కాన్సెప్ట్’ను పూర్తిగా వివరించాలి కదా! పైపైన చెబితే ఎలాగ?”

“ఒక పేరెంట్ కంప్లైంట్ చేసాడయ్యా! అందుకే నిన్ను అడగవలసి వస్తోంది. ఈ సమాజంలో అందరూ శ్రమదోపిడీ చేసే జీవిస్తున్నారని, కొందరు ‘బాగా’ సంపాదించారు అంటే – వాళ్ళు ‘బాగా’ శ్రమదోపిడీ చేశారని చెప్పావంటగా!”

“అవును. కాని- ఆ మాటలు నావికాదు. ‘బొండుమల్లెలు’ పాఠంలో రచయిత చా.సో. చెప్పినవే ” అనాడు ఆనందరావు.

“నువ్వు అదే చెప్పలేదు. ఇంకా చాలా చెప్పావు. దోపిడీ విధానాలు అదనపు విలువ – కారల్ మార్క్స్… ఇవన్నీ చెప్పావు. రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి, గురజాడ,అల్లూరి, భగత్ సింగ్ – వీళ్ళందరి గురించి చెప్పావు… అవునా”

“అవును- వీళ్ళు ఈ సమాజాన్ని మార్చాలని చూసిన వాళ్ళు! శ్రమదోపిడీ పోవాలంటే – దీనికి ముందు సమాజంలో రావలసిన అనేక సంస్కరణల గురించి చెప్పాను. ఆ సందర్భంలోనే వీళ్ళ గురించి చెప్పవలసి వచ్చింది. ఇదంతా ఆ పాఠానికి సంబంధించిన అంశమే!”

“వరకట్నం, కులాంతర వివాహాల గురించి చెప్పావటగా”

“చెప్పాను. గతంలో ఎన్నో సంస్కరణలు జరిగాయి. ఇంకా జరగవలసినవి ఉన్నాయని చెప్పాను. ఇవి రెండు ప్రజంట్ ప్రోబ్లంస్. వీటిని సంస్కరించాలని చెప్పాను. కులాలుగా సమాజం చీలిపోయి ఉన్నంతకాలం సమాజాన్ని మార్చటం చాలా కష్టం. ‘శ్రమదోపిడీ’ అనేది అందరికీ సంబంధించినది. ఒక కులానికి సంబంధించినది కాదు. అందుకే కులాలన్నీ ఏకం కావాలని చెప్పాను”

“కాని- మరింత ఉత్సాహంతో ‘మీలో కులాంతర వివాహాలు చేసుకునేవాళ్ళెందరో చెప్పండి – అని విద్యార్ధుల్ని అడిగావటగా?”

“అడిగాను. క్లాస్ రూం నుండే ఈ సంస్కరణ అవసరమని అడిగాను.”

“అదే యిప్పుడు నీ కొంపముంచింది. ‘మీరు చదువులు చెబుతున్నారా? కులాంతర వివాహాలను చేసుకోమంటున్నారా!’  అంటూ ఒక పేరెంటు ఘాటుగా దులిపేశాడు” అన్నాడు ప్రిన్సిపాల్.

ఆనందరావు ఏమీ మాట్లాడలేదు.

“నీ అత్యుత్సాహం వల్ల నీ ఉద్యోగానికి ముప్పు వచ్చింది. నీకు అనేకసార్లు చెప్పాను. ఇక నేనేం చెయ్యలేను. డైరెక్టర్ నిన్ను ఉద్యోగానికి రాజీనామ చెయ్యమన్నారు.”

“ఈ పాఠానికి రిలేటెడ్`గా ఉన్న అన్ని అంశాలు చెప్పాలని వాచకంలోనే చివర వ్రాసాడు చూడండి ” అన్నాడు ఆనందరావు.

“వాళ్ళు అలాగే రాస్తారయ్యా! కాని నువ్వు వాళ్ళు రాసారు కాబట్టి చెప్పలేదు. చెప్పాలనుకున్నావు కాబట్టి చెప్పావు. అందుకే నువ్వు కులాంతర వివాహాల దాకా పోయావు.”

“ఏదో మార్కుల కోసం కాకుండా – జీవితాన్ని ఉన్నతంగా మార్చటం కోసం చదువుకోవాలి. అందుకే అలా చెప్పాను.”

“అంత లోతు చదువులు వీళ్ళకు అవసరం లేదు. ఈ కార్పొరేట్ విద్య అంతా షో బిజినెస్ అని నాకూ తెలుసు! ఏమీ అనుకోకు ఇంక నువ్వు వెళ్ళచ్చు.” అన్నాడు ప్రిన్సిపల్

ఈ కార్పొరేట్ ‘ అమానుషం’ పిల్లల్ని భౌతికంగాను, మానసికంగాను హింసించడమే కాక జ్ఞానాన్ని కూదా సెన్సార్ చేస్తోంది. ఉపాధ్యాయుల్ని కీలుబొమ్మల్ని చేసి ఆడిస్తోంది – అని ఎంతో బాధపడ్డాడు ఆనందరావు.

తన రాజీనామా లేఖ సమర్పించి, ఈ అమానుషాన్ని ఎదుర్కోవటం ఎలాగ? అని ఆలోచిస్తూ అడుగు బయటకు వేసాడు.

-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-